Kanti Velugu | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. 94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 44 వేల 267 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. 15 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 75 లక్షల 62 వేల 259 మంది పురుషులు, 85 లక్షల 06 వేల 175 మంది స్త్రీలు, 11,584 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. కోటి 20 లక్షల 42 వేల 218 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది. మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి పరీక్షలు చేయగా, ఈసారి 94 పని దినాల్లో 10 లక్షలకు పైగా అదనంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 12,501 గ్రామపంచాయతీల్లో, 3666 మున్సిపల్ వార్డులలో కంటిపరీక్షలు పూర్తి కాగా, మొత్తంగా ఇప్పటికే 15 జిల్లాల్లో స్క్రీనింగ్ పూర్తి అయిందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ కార్యక్రమం వంద రోజులకు చేరువ కాబోతున్నది. అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేయాలి. వెంటనే రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడంతో పాటు, నిర్దేశించిన సమయంలో ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇవ్వాలి. మిగిలి ఉన్న జిల్లాల్లో పరీక్షలు ఎక్కువగా చేయాలి. ప్రచారం కల్పించి అవగాహన పెంచాలి. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.