హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లుకలుకలు పరాకాష్టకు చేరుకొన్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా విమర్శలకు దిగడంతో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి చేరింది. పార్టీలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని, పవన్ కల్యాణ్తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని కన్నా లక్ష్మీనారాయణ బుధవారం గుంటూరులో మీడియా ప్రతినిధులతో సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తానే అయినట్టు వ్యవహరించడం వల్లనే సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. తన అభిప్రాయాలను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదని సోము వీర్రాజుపై ఇప్పటికే రెండుసార్లు విమర్శలు గుప్పించిన కన్నా.. తాజాగా మరోసారి ఆయన తీరుపై అసహనం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలసత్వం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్కల్యాణ్తో సమావేశమయ్యారన్నారు. బుధవారం సాయంత్రం గుంటూరు లోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని కన్నా అనుచర వర్గాలు తెలిపాయి.