కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 25 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లోపించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ధ్వజమెత్తారు. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన ఉద్యమకారులకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ వాగ్దానం చేసి మాటతప్పిందని మండిపడ్డారు.
కరీంనగర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీల అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా టఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న సమయంలో ఉద్యమకారుల గుర్తింపు కోసం 30 రోజుల్లో కమిటీలు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. ఉద్యమకారులకిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 29లోగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 30న అసెంబ్లీని అష్టదిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భోజనాలు వడ్డిస్తామని చెప్పారు.