Kamareddy | కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
ఎస్పీ పేర్కొన్న వివరాల మేరకు… ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలను నిందితుడు చేసినట్లుగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగే వారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధూ శర్మ చెప్పారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్తో పాటుగా ఒక మైనర్ బాలుడు, మరో ఇద్దరు నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44కు ఐదు కిలో మీటర్ల దూరంలో డిసెంబర్ 14న హత్యకు గురైన దివ్యాంగురాలైన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లైంగికదాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీ టీవీలను పరిశీలించగా ఒక అనుమానాస్పద కారును గుర్తించినట్టు తెలిసింది. ఈ కారు నంబర్తోపాటు సెల్ఫోన్ సిగ్నల్ డాటాను విశ్లేషించగా మాక్లూర్ మండలంలోని ప్రశాంత్ అనే యువకుడికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతం అయ్యాయి. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు హత్యా వివరాలు ఇలా ఉన్నాయి.
1. డబ్బులిస్తానని నమ్మబలికి తొలుత రాచర్లకూన ప్రసాద్ను ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లాడు. డిచ్పల్లి హైవే పక్కన హత్య చేశాడు. అక్కడే పూడ్చిపెట్టాడు.
2. కొన్నిరోజులుగా ప్రసాద్ కనిపించకపోవడంతో అప్పులిచ్చినవారు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని వెంటనే పోలీస్స్టేషన్కు రావాలని ప్రసాద్ భార్య రమణిని నమ్మించాడు. తన వెంట తీసుకొని వెళ్లి బాసర వద్ద హత్యచేసి, గోదావరిలో పడేశాడు.
3. ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్ చెల్లి స్వప్న (దివ్యాంగురాలు)ను తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు.
4. ప్రసాద్ తల్లికి మాయమాటలు చెప్పి అతడి పిల్లలిద్దరినీ నిజామాబాద్, నిర్మల్ జిల్లా సరిహద్దులోని సోన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కిరాతకంగా చంపేసి, మృతదేహాలను కాలువలో పడేశాడు. అందులో ఒక మృతదేహం ఈ నెల 8న లభించగా, సోమవారం మరో మృతదేహం దొరికింది.
5. వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారని నమ్మించి ప్రసాద్ మరో చెల్లి స్రవంతిని ప్రశాంత్ తన వెంట తీసుకెళ్లాడు. ఆమెకు నిప్పంటించి చంపేశాడు.
ప్రసాద్, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారని నమ్మబలికి ప్రసాద్ ఇద్దరి చెల్లెళ్లు స్వప్న (దివ్యాంగురాలు), స్రవంతిని వేర్వేరుగా హంతకులు చంపేశారు. ఇందులో ఒకరి మృతదేహం భూంపల్లి శివారులో దొరకడంతోనే ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వరుసగా మొదటి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేసినట్టుగా తెలుస్తున్నది. మిగిలిన హత్యలను ప్రశాంత్ సన్నిహితులైన మైనర్లు చేసినట్టు సమాచారం. నిందితులను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
త్వరలోనే పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఆరుగురి హత్య ఉదంతంలో డిసెంబర్ 8న ప్రసాద్ కూతురు చైత్రిక, డిసెంబర్ 5న చేగుంటలో చెల్లె స్రవంతి, డిసెంబర్ 14న భూంపల్లిలో మరో చెల్లె స్వప్న (దివ్యాంగురాలు), డిసెంబర్ 18న కుమారుడు చైత్రిక్ మృతదేహాలను సోన్ బ్రిడ్జి(నిజామాబాద్ – నిర్మల్ సరిహద్దు) వద్ద పోలీసులు గుర్తించారు. ప్రసాద్, రమణి మృతదేహాలను వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
సీరియల్ కిల్లర్ ప్రశాంత్ వయసు 25 ఏండ్లే. పేద కుటుంబమే అయినా జల్సాలు చేసేవాడు. కొత్త కార్లు, బైక్లను కొని గ్రామంలో షో చేస్తుండటంతో కొంత మందిలో అతడిని ఫాలోఅయ్యేవారు. చిన్న వయసులోనే మాయమాటలు చెప్పడంలో ఆరితేరిన ప్రశాంత్కు ఇంతకు మునుపు భూ లావాదేవీల విషయంలో పదుల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయ భూములకు రుణాలు ఇప్పిస్తానంటూ తన పేరిట ఆస్తులను రాయించుకోవడం.. వాటిని వేరే వ్యక్తులకు అమ్మేసి జల్సాలు చేయడం రివాజుగా మారింది.
ఎవరైనా ప్రశ్నిస్తే తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ పలువురి ఫొటోలు చూపిస్తూ బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు సైకిల్ కూడా లేని వ్యక్తి ఒక్కసారిగా కొత్త కారు, హైఫై సోకులను చూసి అమాయకులు అతరి బుట్టలో పడిపోయారు. ఇలా చాలా మంది మోసపోయి లబోదిబోమనగా ప్రసాద్ కుటుంబమైతే ఏకంగా ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రశాంత్ నడిపించిన భూ దందాల్లో లోతుగా విచారణ చేస్తే మరికొంతమంది అదృశ్యమైన వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశాలున్నట్టు మాక్లూర్ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రశాంత్ చేతిలో హత్యకు గురైన ప్రసాద్ సైతం గతంలో ఒక యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు కాగా పలువురిని మోసం చేసిన కేసుల్లోనూ ముద్దాయి కావడం విశేషం.