వరంగల్ : నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 95 మంది మహిళలకు రూ. 95.11 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక ఒత్తిడులను తట్టుకుని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలుచేస్తోంది. పార్టీలకతీతంగా, పైసా లంచం ఇవ్వకుండా, పైరవీలు లేకుండా నిరుపేదలైన ఎంతో మంది పేద ప్రజలు అన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతోంది. ఇంతమంచి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల ఇళ్లలో ఆడపిల్లల పెండ్లిల కోసం అప్పు చేసినటువంటి తల్లిదండ్రులను ఆర్ధికంగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంటుంది ” అని ఆయన అన్నారు.
అలాగే.. మహిళలకు సంబంధించి పెళ్లి వయసు నిబంధన గురించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుదర్శన్ రెడ్డి స్పందించారు. దేశంలో ఇప్పటివరకు అమ్మాయిలకు పెళ్లి వయసు 18 సంవత్సరాలు ఉండగా.. ఇప్పుడు ఆ వయో పరిమితి 21 సంవత్సరాలుగా పెంచడానికి పలు చర్చలు జరుగుతున్నాయని, అది సమాజానికి చాలా మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.