జగిత్యాల : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందన్నారు.
ఈ పథకాలతో సీఎం కేసీఆర్ నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నలా అండగా ఉంటున్నారని ప్రశంసించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో రూ.4 కోట్ల 61 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు నిర్మాణానికి, శంకుస్థాపనలు, మహిళల, కుర్మ సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు. అలాగే పెగడపల్లి మండలం కేంద్రంలోని 2 కోట్ల రూపాయల నిధులతో షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.