ములుగు, డిసెంబర్12 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన పైడిపల్లి రమేశ్-ఉమ ఇంట్లో వెలుగులు నింపింది. మొదటి, రెండో కాన్పులో ఇద్దరు కుమారులు జన్మించగా మూడో కాన్పులో ఇద్దరు కవల ఆడబిడ్డలు జన్మించారు. వ్యవసాయ రైతులుగా, కూలీలుగా జీవనం సాగించే ఉమ-రమేశ్లు బిడ్డల పెండ్లి చేసేందుకు రోజూ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసేవారు. 10వ తరగతి వరకు ఇద్దరు బిడ్డలను ప్రైవేటులో చదివించిన తల్లిదండ్రులు ప్రభుత్వం మాడల్ పాఠశాలలో అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యను పిల్లలకు అందించాలనే ఉద్దేశంలో ఇంటర్మీడియట్ను బండారుపల్లి మాడల్ పాఠశాలలో పూర్తి చేయించారు.
పెద్ద బిడ్డ అఖిలను ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ సూపర్వైజర్ విద్యాసాగర్కు, చిన్న బిడ్డ అనూషను వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి కిరణ్కు ఇచ్చి ఈ ఏడాది మే 25న పెండ్లి చేశారు. ఆ తర్వాత కల్యాణలక్ష్మి పథకానికి ధరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం ఇద్దరి బిడ్డలకు రూ.1లక్ష 116 చొప్పున కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను సోమవారం తహసీల్దార్ మధురకవి సత్యనారాయణస్వామి, ఎంపీటీసీ పోరిక విజయ్రాంనాయక్లు సోమవారం తల్లి ఉమకు అందించారు.