MLC Kavitha | తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. హ్యాట్రిక్ కొడుతారన్నారు. సోలాపూర్లో సద్దుల బతుకమ్మ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గేలిపిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని చెప్పారు.
కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను మభ్యపెడుతూనే ఉంటుందని విమర్శించారు. 65ఏళ్ల పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ చేయని పనులన్నీ.. పదేళ్లలో చేసి చూపించామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించారని.. కాబట్టి తమ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. మరి ఆ ఆరు గ్యారెంటీల అమలకు ఏ నేత గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యారంటీల హామీలు ఇస్తోందని విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందనీ, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ అక్కడ తెలంగాణ వాసులు గంగా జమున తహజీబ్ లా కలిసిపోయారని హర్షం వ్యక్తం చేశారు.
సోలాపూర్ పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత చేనేత పరిశ్రమలను సందర్శించారు. కార్మికులతోనూ మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని కవిత దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసానిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. అయితే, మరాఠా సర్కారు కానీ.. కేంద్ర కానీ చేనేత రంగాన్ని విస్మరించడంతో సంబంధిత పరిశ్రమలు కుదేలవుతున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, సోలాపూర్లో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులను సైతం కలిశారు. కార్మికులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సోలాపూర్లో దాదాపు 70వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని.. మహారాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని కవిత దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో బీడీ కార్మికులకు అందిస్తున్న రూ.2వేల పెన్షన్ను మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ సంకల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వచ్చిన కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్ లో మధ్యాహ్నం నగేశ్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.