MLC Kavitha | కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, ఇండ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని.. కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదని.. మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి బీఆర్ఎస్దన్నారు.
మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని సూచించారు. పారిశ్రామిక వ్యర్ధాలు మూసిలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? అని నిలదీశారు. మూసి నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారన్నారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా.. గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారన్నారు. మూసిలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మూసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. మూసిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా మార్చాలని చూస్తున్నారన్నారు. హైదరాబాదుకు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి – గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదన్నారు.
రూ.7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. కొండపోచమ్మ నుంచి మూసి అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. పేద ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం .. మూసి ప్రక్షాళనకు అయ్యే వ్యయం రూ.50 వేల కోట్లు అని ఒకసారి, రూ.లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారన్నారు.
మూసిని ఏటీఎంగా మార్చుకొని.. వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక సీఎం వేసుకున్నారని విమర్శించారు. యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలేందుకు కేసీఆర్ సంకల్పించారన్నారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారన్నారు. ఫ్లోరైడ్ని నిర్మూలించిన ఘనత కేసీఆర్దేనన్నారు. అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు.