హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో మిగులు పనుల పూర్తికోసం చేపట్టిన ప్యాకేజీ 27 యూనిట్ -3 పనులను జూన్లోపు పూర్తిచేసి చెరువులను నింపి 2100 ఎకరాలకు నీరివ్వాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. అరణ్యభవన్లో మంగళవారం కాళేశ్వరం ప్యాకేజ్ 27, 28, సదర్మాట్ బరాజ్ పనులపై మంత్రి నీటిపారుదల, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనుమతుల విషయంలో అటవీశాఖ నిర్లక్ష్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి నుంచి మామడ మండలం దిమ్మదుర్తి వరకు 19 కిలోమీటర్ల కాలువ పనులను ఆగస్ట్లోగా పూర్తిచేయాలని చెప్పారు.
సదర్మాట్ బరాజ్
సదర్మాట్ బరాజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 55 గేట్లను బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. వానకాలంలోగా గేట్ల బిగింపు పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలని మంత్రి చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో రూ.89 కోట్లతో చేపట్టనున్న 15 చెక్డ్యాంల నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, సీఎఫ్ వినోద్కుమార్, నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణానికి ఇంద్రకరణ్రెడ్డి
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని ఆలయ అధికారులు, వేద పండితులు ఆహ్వానించారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో ఇంద్రకరణ్రెడ్డి దంపతులను కలిసి ఆహ్వానపత్రిక అందించారు. ఏప్రిల్ 10న నిర్వహించనున్న స్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, వాల్పోస్టర్ను మంత్రి ఆవిష రించారు. మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తెలిపారు.