తొగుట, ఫిబ్రవరి 17: రైతులకు పుష్కలంగా సాగునీరు అందటంచూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఇంత ఎండల్లో కూడవెల్లి, హల్దీ వాగుల్లో పారుతున్న కాళేశ్వర జలాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీ నుంచి శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు హరీశ్రావు నీటిని వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండల్లోనూ చెరువులు, కుంటల్లోకి గోదావరి జలాలు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన దుబ్బాక ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదంటున్న ప్రతిపక్ష నాయకులు, కూడవెల్లి వాగులో పారుతున్న గోదావరి జలాలను చూసి మాట్లాడాలని సవాల్ చేశారు.
గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం 12వ ప్యాకేజీ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కాలువ కింద 257 చెరువులు, కుంటలు ఉండగా, 91 చెరువులు, కుంటలకు నీళ్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో చిన్న కాలువ, చెరువు తవ్విన పాపాన పోలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ హరిరాం, నీటిపారుదల శాఖ ఎస్ఈ బస్వరాజ్, ఎస్ఈ సాయిబాబా, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.