Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి, జనవరి 14 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీ బరాజ్)లో కుంగిన పిల్లర్పై ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన డైనోసార్ ఏజెన్సీ ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ పనులను కొనసాగిస్తూనే ఉన్నది. ఏజెన్సీ రోజుల తరబడి విచారణ కావాలనే జాప్యం చేస్తుందా? లేక ప్రభుత్వ ఆదేశాల మేరకే కాలయాపన చేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే యాసంగికి నీరెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డపై సర్కార్ తాత్సారంపై మండిపడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాకు 20వ పిల్లర్ కుంగడంతో ఎల్అండ్టీ ప్రతినిధులు సందర్శించి పునరుద్ధరణ పనులు చేపడతామని వెల్లడించిన విషయం తెలిసిందే. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం, డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ టీం సైతం సందర్శించి కుంగుబాటుపై నివేదిక ఇచ్చింది.
ఇటీవల మంత్రుల బృందం మేడిగడ్డ, అన్నారం బరాజ్లను సందర్శించి బరాజ్లను ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం (సరస్వతీ బరాజ్) బరాజ్ల వద్ద పునాదుల పరిశీలన కోసం నిర్మాణ సంస్థలు వాహనాల రాకపోకలకు అనుగుణంగా రోడ్డు ఏర్పాటు చేయగా ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను డైనోసార్, పార్సన్ అనే ఏజెన్సీలకు అప్పగించిన విషయం తెలిసిందే. డైనోసార్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ పనులను ఈ నెల 5న ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నది. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన అనంతరమే పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి.
సా..గుతున్న పరీక్షలు..
డైనోసార్ కంపెనీ ప్రతినిధులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ టెస్ట్ (ఈఆర్టీ)తోపాటు ఇతర పరీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ త్వరగా పూర్తయితే 19, 20, 21వ పిల్లర్ల వద్ద కాఫర్ డ్యాం పనులను వేగవంతం చేసేందుకు నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉన్నది. విచారణ నివేదిక ఆధారంగా ఈ మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్తో తొలగించి మళ్లీ పనులు చేపట్టే అవకాశాలున్నా యి.
అయితే ఇన్వెస్టిగేషన్ పనుల్లో జాప్యం జరుగుతుండటంతోపాటు ఇటీవల విజిలెన్స్ అధికారులు మూడు రోజులపాటు రికార్డుల తనిఖీ నిర్వహించడంతో ఇన్వెస్టిగేషన్ పనుల్లో మరింత జాప్యం నెలకొన్నది. బరాజ్లపై విచారణ, మరమ్మతు పనులు ఏకకాలంలో జరిగితేనే ప్రాజెక్టుకు చికిత్స జరిగినట్టు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అన్నారం బరాజ్లోని 28, 38 ఔట్లెట్ల వద్ద ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు ట్రీట్మెంట్ ప్రారంభమైంది.
నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ సీపేజ్లకు ప్రత్యేక కెమికల్తో గ్రౌటింగ్ పనులు ప్రారంభించింది. 15 రోజుల్లో పనులు పూర్తి చేసి అన్నారం బరాజ్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇదిలావుండగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు తెలిసి వస్తుందని, యాసంగికి నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం తడుముకునే పరిస్థితి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. అన్నదాతకు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద దిక్కని వారు స్పష్టం చేస్తున్నారు.