హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ఇంజినీర్ల బృందం కొనియాడింది. అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం గొప్ప విషయమని ప్రశంసించింది. ములుగు జిల్లాలోని సమ్మక్కసాగర్ బరాజ్లో 83 మీటర్ల మేర నీటిని నిల్వ చేసినప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్తూర్ గ్రామంలో అత్యంత స్వల్పంగా 22 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతున్నది. దీనిపై ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు జాయింట్ సర్వే నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈఎన్సీ హరిరాం, సీఈ విజయభాస్కర్, ఛత్తీస్గఢ్ నుంచి సీఈ నగరియా, ఎస్ఈ కేఎస్ భండారి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించారు. బరాజ్ నిర్మాణాన్ని వారికి ఈఎన్సీ హరిరాం వివరించారు.
ముంపు ప్రభావాన్ని మ్యాప్ల ఆధారంగా కళ్లకుగట్టారు. సమ్మక్కసాగర్ బరాజ్ను అతితక్కువ ముంపుతో డిజైన్లకు అనుగుణంగా నిర్మించడంపై ఛత్తీస్గఢ్ అధికారులు సం తృప్తి వ్యక్తం చేశారు. బరాజ్ ద్వారా వ్యవసాయభూములకు ముంపు ఏమీ వాటిల్లడం లేదని నిర్ధారించుకొన్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను ఈఎన్సీ హరిరాంను అడిగి తెలుసుకొన్నారు. సమీపంలో ఉన్న ప్రాజెక్టులనూ సందర్శించేందుకు ఆసక్తి చూపగా, వారిని సమీపంలోని లక్ష్మీ బరాజ్, అన్నారం బరాజ్, పంప్హౌస్లకు ఈఎన్సీ హరిరాం తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను తెలుసుకొని ఛత్తీస్గఢ్ ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.