హనుమకొండ చౌరస్తా : ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించే లక్ష్యంతో కాకతీయ విశ్వవిద్యాలయం ( KU) కీలక ముందడుగు వేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి ( Professor K. Pratap Reddy, ) అన్నారు. జర్మనీ పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ మూడు విశ్వవిద్యాలయాలతో ఆయన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ మేరకు 2026 జూన్ 1న ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాధిపతులకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను సమర్పించారు. ఈ సందర్భంగా విదేశీ సంబంధాల డైరెక్టర్ కై హిల్లెబ్రెఖ్ట్, అంతర్జాతీయ సంబంధాల విభాగాధిపతి, డిప్యూటీ డైరెక్టర్ టాంజా ఫాల్కోవ్ స్కీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, రూసా 2.0 రాష్ట్ర ప్రాజెక్టు అధికారి డాక్టర్ సౌందర్య జోసెఫ్ చర్చల్లో పాల్గొన్నారు.
ప్రతిపాదిత అవగాహన ఒప్పందాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, సంయుక్త పరిశోధన అవకాశాలు, విద్యార్థి-అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, సమ్మర్, వింటర్ స్కూల్స్లో పాల్గొనే అవకాశాలు, అధ్యాపకుల అకాడమిక్ సహకారం వంటి అనేక అంతర్జాతీయ అవకాశాలు లభించనున్నాయి.