వరంగల్ : కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భంజ్దేవ్ ఇవాళ ఉదయం వరంగల్కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. బస్తర్లో తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
కాకతీయుల చరిత్రను భావితరాలకు తెలియజేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాకతీయుల వారసులను పిలిచి ఉత్సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. వరంగల్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు అమితమైన ప్రేమ అని తెలిపారు. కాకతీయుల ఆదర్శంతోనే ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు కాకతీయుల చరిత్రను మరుగున పడేలా చేశాయన్నారు. కేసీఆర్ పట్టుదలతో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందన్నారు.
కాకతీయుల గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ చేపట్టామని తెలిపారు.