Kadiyam Srihari | కాళేశ్వరంపై వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి థ్యాంక్స్ చెప్పారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని.. అయితే, అధికారులు రూ.93వేలకోట్లు ఖర్చు చేసినట్లు మాత్రమే వెల్లడించారన్నారు. రూ.93వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అంటూ నిలదీశారు.
అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ ప్రకారం 98వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చామని చెప్పారని.. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం అవాస్తవం తేలిందన్నారు. ప్రాజెక్టు కింద ఎకరాకు నీరు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని.. కానీ 98వేల ఎకరాలకు నీరు ఇచ్చినట్లు అధికారులే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను తాము స్వాగతిస్తున్నామన్నారు. తుమ్మిడి హట్టి ద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకురావచ్చని మంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్రతో ఎందుకు ఒప్పందం చేసుకోలేదని ప్రశ్నించారు.
మొబిలైజేషన్ అడ్వాన్స్లు, సర్వేలు, భూసేకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,116 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. తుమ్మిడిహట్టి సాధ్యం కాదని తెలిశాకే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీ డిజైన్ చేసిందని.. కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం దురదృష్టకరమన్న మాజీ మంత్రి.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణకు కమిటీ వేయకుండా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.
తాము కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడడం సిగుచేట్టన్నారు. దేశంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అంచనాలు పెంచుకోకుండానే పూర్తయ్యిందా? అని ప్రశ్నించిన కడియం.. దీనిపై ఉత్తమ్ కుమార్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 141 టీఎంసీలు నీటిని చిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. ల్యాండ్ క్రూజర్స్పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను సైతం కడియం తప్పుపట్టారు.
రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో ల్యాండ్ క్రూజర్స్ కొనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ల్యాండ్ క్రూజర్స్ వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం వాడుకోదా..? వాటిని అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. అందులో ఏమైనా అవినీతి జరిగిందా? అంటూ నిలదీశారు. ప్రగతి భవన్ను హాస్పిటల్ చేస్తామన్నారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అందులోనే ఉంటున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్కు లంకె బిందెల కోసం వస్తారా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు.