స్టేషన్ ఘన్ పూర్, ఆగస్టు 23 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి విజయం ఖాయమని, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తనకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి బుధవారం స్టేషన్ ఘన్ పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, నియోజకవర్గంలో కడియంకు ఎదురు లేదన్నారు.
పార్టీ శ్రేణులు విభేదాలు మరచిపోయి, కలిసి కట్టుగా పని చేయాలన్నారు. అందరినీ సంతృప్తి పరచలేం. అయినా, అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఇక త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు మంత్రి పిలుపునిచ్చారు. బాగా చదువుకున్నవాడు, సౌమ్యుడైన శ్రీహరిని గెలుపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.