హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు చేయలేదని అందువల్ల అడుగుతున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari )అన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్(Budget)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏడాదికి 1.36 లక్షల కోట్లు అవసరం.
రుణమాఫీ సహా కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లకు అయ్యే వ్యయం అదనం అవుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని బడ్జెట్లో చెప్పారు. 119 నియోజకవర్గాల్లో 4.16 లక్షల ఇళ్లకు రూ.24 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. అయితే బడ్జెట్లో కేవలం రూ.7వేల కోట్లే కేటాయించారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.