నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్23(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకే మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని విమర్శించారు. కానీ, ఎంతమంది దేవుళ్లపై ఒట్లు వేసినా ఈసారి ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు ఇచ్చేందుకు కేసీఆర్ 10 వేల కోట్లను సిద్ధం చేసి పెడితే అడ్డుకొని ఎన్నికల తర్వాత వాటిని కాంట్రాక్టర్లకు చెల్లిచి వాళ్ల నుంచి కమీషన్ల రూపంలో ఢిల్లీకి కప్పం చెల్లించారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్రెడ్డి దుర్భాషతో కాలయాపన చేస్తున్నారని, సీఎం హోదాలో ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఈసడించుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, అందుకు సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని జగదీశ్రెడ్డి విమర్శించారు. గుజరాత్లో మోదీపాలన తనకు ఆదర్శమన్న రేవంత్రెడ్డి మోదీకి రాష్ట్రంలో ప్రథమ శిష్యుడని పేర్కొన్నారు. మోదీని పల్లెత్తు మాట అనకుండా కేవలం కేసీఆర్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నాడని చెప్పారు. తెలంగాణ హక్కులు కాపాడుకోవాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో జరిగే కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగులు, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇస్లావత్ రాంచంద్రనాయక్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జిల్లా మంత్రులు తాగి ఎక్క డున్నారని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డినే రైతులు చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులకు దక్కాల్సిన మద్దతు ధర విషయంలో మిల్లర్లతో కుమ్మక్కై మంత్రులు రైతులకు ఎగనామం పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.500 బోనస్ను వ్యాపారులకు కట్టబెట్టడం కాంగ్రెస్ సర్కారుకే చెల్లిందని విమర్శించారు. నాగార్జునసాగర్లో నీళ్లున్నా ఇవ్వలేక మూడున్నర లక్షల ఎకరాల పంట చేలను ఎండబెట్టిన ఘనత జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిదేనని ఆరోపించారు.