హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం (Jyoti Rao Phule statue) ఏర్పాటుకు బీసీలంతో సంఘటితం కావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్, కర్పూరి ఠాకూర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే ధ్యేయంగా భారత్ జాగృతి పోరాటం చేస్తుందని ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో (Assembly premises) జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తుందని అన్నారు. ఏప్రియల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు వినతి పత్రాన్ని అందించామని, ఇందుకోసం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖను సైతం అందించామని అన్నారు. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంఘసంస్కర్తల జయంతిలను అధికారికంగా నిర్వహించామని తెలిపారు. మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు (Reservations) దక్కాయని వివరించారు.