హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 10.80 లక్షల కేసులకు విముక్తి లభించాలంటే పది నుంచి ఇరవై ఏండ్లు కక్షిదారులు నిరీక్షిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు చెప్పారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కన్సిలీయేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హ శాంతివనం ధ్యాన కేంద్రంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సోమవారం ‘సంప్రదింపులు-మధ్యవర్తిత్వం’ అంశంపై హైకోర్టు న్యాయమూర్తులకు మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, నీతిఆయోగ్ నివేదిక ప్రకారం ఆ కేసుల పరిషారానికి 324 ఏండ్లు పడుతుందని చెప్పారు. న్యాయం అందని ద్రాక్ష అయితే సామాన్యుడు సత్వర న్యాయం కోసం ‘మరోదారి’ని ఎంచుకునే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిషార మార్గం మధ్యవర్తిత్వమేనని చెప్పారు.
కేసుల పెండింగ్ వల్ల న్యాయమూర్తులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నదని న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు ప్రసంగిస్తూ, రాష్ట్ర హైకోర్టులో 2.40 లక్షలు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 8.40 లక్షలు చొప్పున మొత్తం 10.80 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. వీటి పరిషారానికి మధ్యవర్తిత్వమే ప్రధాన మార్గమని సూచించారు.