హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మధ్యవర్తిత్వం వల్ల ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుంతుందన్నారు. హైదరాబాద్ ఐఏఎంసీలో (AIMC) జరుగుతున్న ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జ్ లిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మొదటి ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీడియేషన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు.
మధ్యవర్తిత్వం అనేది మన పురాణాల కాలంలోనూ ఉందని చెప్పారు. కౌరవులు, పాండవుల మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్లోనూ పెరిగిందని తెలిపారు. మీడియేషన్ బిల్లు రాకవల్ల మధ్యవర్తిత్వం ప్రాధాన్యం మరింత పెరిగిందని వెల్లడించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలన్నారు. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగాలని సూచించారు. మధ్యవర్తిత్వంలోనూ కృత్రిమ మేథను భాగం చేస్తున్నారని తెలిపారు.
జడ్జిగా తనకు 22 ఏండ్ల అనుభవం ఉందని చెప్పారు. హైదరాబాద్లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై తాను, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నోసార్లు చర్చించుకున్నామని చెప్పారు. మొదట్లో తాను చిన్న స్థాయిలో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నాని తెలిపారు. కానీ.. జస్టిస్ నాగేశ్వరరావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, జస్టిస్ హిమకోహ్లి కూడా ఎంతో సహకరించారని వెల్లడించారు. హైదరాబాద్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు వెనుక జస్టిస్ లావు నాగేశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు.
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని జస్టిస్ హిమ కోహ్లి అన్నారు. సమస్యల పరిష్కారం మధ్యవర్తిత్వం ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేదని చెప్పారు. ఆధునిక కాలంలో కొందరు మీడియేషన్ను మెడిటేషన్గా కూడా పొరబడుతున్నారని తెలిపారు. మధ్యవర్తులు పరిష్కారం కోసం పార్టీలను ఒత్తిడి చేయరని, సమస్య పరిష్కారం కోసం తగిన వాతావరణం ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మూడు రకాల మధ్యవర్తిత్వాలు ఉన్నాయని, వాటిలో కోర్ట్ రిఫర్ మీడియేషన్, ప్రైవేటు మీడియేషన్ ముఖ్యమైనవని చెప్పారు.
హైదరాబాద్లోని మీడియేషన్ కేంద్రం చూసి ఆశ్చర్యపోయానని జస్టిస్ రవీంద్రన్ అన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమ కోహ్లీలను జస్టిస్ ఎన్వీ రమణ ఎందుకు ఎంచుకున్నారో ఈ కేంద్రం చూస్తే అర్థమైందన్నారు. తెలుగు రాష్ట్రాల వ్యక్తిని కాకపోయినా తనకు కూడా జస్టిస్ రమణ భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ గురించి చాలామందికి ఇంకా తెలియదని వెల్లడించారు. దీనిగురించి తెలుసుకుంటే దాని లాభాల కూడా తెలుస్తాయన్నారు. కోర్టు వివాదాల వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వందల కోట్లతో ముడిపడిన సమస్యలు కూడా రోజుల్లోనే పరిష్కారం కావచ్చని తెలిపారు.