బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 19: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. దేశంలో దాదాపు 12 కోట్ల మంది ఎస్టీలు ఉన్నారని, కానీ ఏ ప్రభుత్వం కూడా సేవాలాల్ జయంతిని అధికారింగా నిర్వహించలేదని అన్నారు. దేశంలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్-కోనాపూర్ గ్రామాల మధ్య రూ.12 కోట్లతో నిర్మించే బాలికల గిరిజన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి స్పీకర్ పో చారం శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. నస్రుల్లాబాద్లో రూ.5 కోట్లతో నిర్మించనున్న గిరిజన బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు గ్యా రంటీ స్కీముల పేరిట ఉత్తుత్తి పథకాలతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని, వారిని ఓటు హక్కుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయక పోవడంతో ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. ఇక్కడ అమలు చేస్తామన్న గ్యారంటీ స్కీంలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని మంత్రి ప్రశ్నించారు.
పాలించే సత్తా కాంగ్రెస్కు లేదు: స్పీకర్
సిద్ధ్దాపూర్ రిజర్వాయర్ ద్వారా వచ్చే జూన్ నాటికి 14 వేల ఎకరాలకు సాగు నీరు అం దించి తీరుతానని స్పీకర్ పోచారం ప్రకటించారు. వర్ష్షాకాలం కాగానే కాలువల పని ప్రా రంభమవుతుందని, దగ్గరుండి పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అధికార దాహంతో లేనిపోని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని పాలించే సత్తా ఆ పార్టీకి లేదని స్పీకర్ స్పష్టం చేశారు.