హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా పేద బ్రాహ్మణులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యాపథకం కింద 133 మంది లబ్ధిదారులకు స్కాలర్షిప్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ‘కులాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాయకులకు ఎంతో ధైర్యం కావాలి.
ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరికి కోపమొచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీయంగా నష్టం జరుగుతుందని నాయకులు వీటి జోలికి వెళ్లరు. ధైర్యమున్న కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటుచేసి, వారి అభివృద్ధికి కృషిచేస్తున్నార’ని పేర్కొన్నారు. గతంలో ఎంతో వైభవంగా బతికిన బ్రాహ్మణులు నేడు నిరుపేదలుగా మారిపోయారని, వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. బ్రాహ్మణుల కోసం విదేశీ విద్యా పథకం, బెస్ట్, ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. మరికొన్ని దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని విస్తరించే అవకాశం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంటే, కేంద్రం రాష్ర్టాభివృద్ధికి ఎటువంటి సహకారం అందించడంలేదని పేర్కొన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలేదని, కొత్త ఎఫ్ఆర్బీఎం నిబంధనల పేరుతో అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
పారదర్శకంగా అర్హులకు పథకాలు:రమణాచారి
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పథకాలు పారదర్శకతతో అర్హులకు చేరే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నామని పరిషత్తు చైర్మన్ రమణాచారి తెలిపారు. మనుషుల ప్రమేయం లేకుండా అన్నీ ఆన్లైన్లోనే జరిగే విధంగా ఏర్పాట్లు చేశామని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోరాదని సూచించారు. దేవాదాయశాఖ కమిషనర్ వీ అనిల్కుమార్ మాట్లాడుతూ.. వివేకానంద విదేశీవిద్యా పథకం కింద ఈ ఏడాది 133 మందిని ఎంపికచేసి, వారికి రూ.26 కోట్లు పంపిణీచేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 499 మందికి రూ.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. బెస్ట్ పథకం ద్వారా ఇప్పటివరకు 3,200 మందికి రూ.90 కోట్లు గ్రాంటు రూపంలో అందజేసినట్టు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పథకాల ద్వారా ఇప్పటివరకు 5,748 మందికి రూ.166 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు వివరించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, పాలనాధికారి రఘురామశర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు సభ్యులు మృత్యుంజయశర్మ, పురాణం సతీశ్కుమార్, అష్టకాల రామ్మోహన్, జోషి గోపాలశర్మ, సుమలతాశర్మ, నరేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.