న్యూఢిల్లీ, జూలై 22: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలనే డిమాండ్తో బుధవారం దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో విదార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. జంతర్ మంతర్లో సీజేపీ బుధవారం కూడా తన దీక్షను కొనసాగించింది. అయితే దీక్షాస్థలి వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. సీజేపీ ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వగా, వారిని చెదరగొట్టడానికి పోలీలసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. కొంతమంది కర్రలు ధరించి భద్రతా సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
లీకేజీ బాధ్యులను శిక్షించాలని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ర్టాల్లో ఆందోళనలు చేపట్టారు. బీహార్లోని పట్నాలో లోక్భవన్కు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన విద్యార్థులపై లాఠీ చార్జి, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. మహారాష్ట్రలోని ముంబైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకు వెళ్లి వాహనాలు ఎక్కించారు.