ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్తున్న బీజేపీ.. ఈ తరహా వ్యాజ్యాలు దాఖలు చేయడం శోచనీయం. దర్యాప్తులో భాగంగానే సంతోష్కు సిట్ నోటీసు జారీచేసింది. అంతా బీఎల్ సంతోషే చూసుకుంటారని రామచంద్రభారతి చెప్పినట్టుగా ఫోన్ సంభాషణల్లో ఉన్నది. వారి మధ్య వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తునకు డివిజన్ బెంచ్ అనుమతిచ్చాక కూడా రిట్లు దాఖలు చేయడం దర్యాప్తును అడ్డుకోవటమే. ఇది కోర్టు ధిక్కారమే అవుతుంది.
-అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్ )కు, న్యాయవాది బుసారపు శ్రీనివాస్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) జారీచేసిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. బీఎల్ సంతోష్కు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటరిటమ్ అప్లికేషన్) దాఖలుచేసిన విషయం తెలిసిందే.
కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్ కూడా సిట్ తనకు జారీచేసిన నోటీస్ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ నిర్వహించింది. నోటీసులపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. విచారణకు హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు బీఎల్ సంతోష్ను, శ్రీనివాస్ను అరెస్టు చేయరాదని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదావేసింది.
నిందితులుగా తేలని వారికి కూడా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసే అధికారం తమకు ఉన్నదన్న సిట్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. బీఎల్ సంతోష్కు నోటీసులు అందజేసేందుకు సిట్కు ఢిల్లీ పోలీస్ కమిషనర్సహకరించాలని ఆదేశించింది. నిందితులు కానివారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేయటం చెల్లదని మనీశ్ మహేశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో గతంలో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీని ప్రకారం బీఎల్ సంతోష్కు సిట్ జారీచేసిన నోటీసు చెల్లదని ప్రేమేందర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది చితంబరేశ్ వాదించారు. హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు నిర్వహించాలని డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ, ధర్మాసనానికి తెలుపకుండానే నోటీసులు జారీచేస్తున్నదని ఆరోపించారు.
విచారణ పేరుతో పిలిచి తమ క్లయింటును సిట్ అరెస్టు చేసే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా ఇదే వాదన వినిపించారు. ఈ వాదనను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తోసిపుచ్చారు. సింగిల్ జడ్జి ధర్మాసనం పర్యవేక్షణలో మాత్రమే దర్యాప్తు నిర్వహించాలని డివిజన్ బెంచ్ ఆదేశించిందని, రోజువారీ దర్యాప్తు కోసం అనుమతులు తీసుకోవాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టంచేశారు. మనీష్ మహేశ్వర్ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తించదని వాదించారు. రెండు కేసులు పరస్పరం భిన్నవైనవని పేర్కొన్నారు. ఏజీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
సిట్కు ఏదైనా అవసరమైతే సింగిల్ జడ్జి అనుమతి పొందాలని డివిజన్ బెంచ్ చెప్పిందేగానీ, దర్యాప్తు ఎలా చేయాలి? ఎవరికి నోటీసు జారీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి? అనే విషయాలు నిర్ణయించటానికి కాదని స్పష్టంచేశారు. సిట్ దర్యాప్తునకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చిందని, ఈ క్రమంలో సిట్ దర్యాప్తులో భాగంగానే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.
నిందితులు కానివారికి కూడా సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీచేయవచ్చని స్పష్టంచేశారు. సిట్ అరెస్టు చేస్తుందేమోనని పిటిషన్దారులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వారిని అరెస్టు చేయరాదని సిట్ను ఆదేశించింది. అదే సమయంలో నోటీసుల అమలును నిలిపివేయడంలేదని స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తును కొనసాగించవచ్చని తెలిపింది.
సిట్ దర్యాప్తును అడ్డుకోవటానికే బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారని ఏసీ బీఎస్ ప్రసాద్ వాదించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్తున్న బీజేపీ.. ఈ తరహా వ్యాజ్యాలు దాఖలు చేయడంశోచనీయమని పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగానే సంతోష్కు సిట్ నోటీసు జారీచేసిందని స్పష్టంచేశారు. ఫోన్ సంభాషణల్లో అంతా సంతోషే చూసుకుంటారని ఉన్నదని గుర్తుచేశారు. బండి సంజయ్, కిషన్రెడ్డి వంటి వాళ్లకు ఏ సంబంధమూ లేదని, అంతా సంతోష్, అమిత్ షా చూసుకొంటారని కూడా ఆ సంభాషణల్లో ఉన్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి జరిపిన ఫోన్ సంభాషణల్లో సంతోష్ పేరు పలుసార్లు ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. వారితో కూడా సంతోషే చూసుకొంటారని కూడా రామచంద్రభారతి చెప్పినట్టుగా ఉన్నదని చెప్పారు. సంభాషణలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే సంతోష్కు 41ఏ నోటీసు జారీ అయ్యిందని స్పష్టంచేశారు.
నిందితులు కానివారికి 41ఏ నోటీసు ఇవ్వకూడదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. నిందితులు, అనుమానితులకు 41ఏ నోటీసు ఇవ్వొచ్చని చట్టం చెప్తున్నదని, చట్టానికి అతీతంగా చేయాలని బీజేపీ కోరడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు ఆడియో, వీడియోల రూపంలో సిట్ వద్ద అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ దశలో బీజేపీ పదేపదే కేసులు వేసి దర్యాప్తు ముందుకు సాగకుండా చేయడం సరికాదని అన్నారు. డివిజన్ బెంచ్ ఈ నెల 29వ తేదీ నాటికి ప్రాథమిక నివేదికను సింగిల్ జడ్జికి సమర్పించాలని ఆదేశించిందని, ఇదే తరహాలో రిట్లు దాఖలు చేసుకొంటూపోతే దర్యాప్తు ముందుకు సాగదని తెలిపారు.
సిట్ దర్యాప్తునకు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఈ తరహా రిట్లు దాఖలు చేయడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని, ఇది కోర్టు ధికారమే అవుతుందని చెప్పారు. రామచంద్రభారతి వాట్సాప్ మెసేజ్ సంతోష్కు పంపారని, దీనిని నివృత్తి చేసుకొనేందుకే సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. సంతోష్కు వాట్సాప్ ద్వారానే నోటీసులు ఇచ్చామని తెలిపారు.
బీజేపీ నేత సంతోష్ను అరెస్టు చేయాలని సిట్ చూస్తున్నదని, సిట్ దర్యాప్తు ఆందోళనకరంగా ఉన్నదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీహెచ్ వైద్యనాథన్ వాదించారు. జాతీయ స్థాయి బీజేపీ నేతకు నోటీసు జారీ అయితే దాని ప్రభావం పార్టీకి జాతీయ స్థాయిలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలకు ఆసారం ఉంటుందని కూడా చెప్పారు. అరెస్ట్ చేయాలనే కుట్రలో భాగంగానే 41ఏ నోటీసు ఇచ్చారని చెప్పారు. దర్యాప్తు గోప్యంగా ఉంచాలని డివిజన్ బెంచ్ ఆదేశించినప్పటికీ ఎవరికి నోటీసులు ఇచ్చారో, నిందితులు ఏం చెప్పారో వంటివి కీలక సమాచారం పత్రికల్లో వచ్చిందని చెప్తూ.. సాక్షి, వెలుగు వంటి పత్రికల్లో ప్రచురించిన వార్తల క్లిప్పింగ్స్ను న్యాయమూర్తికి అందజేశారు.
సిట్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని, దానిని అడ్డుకోవాలని కోరారు. సిట్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు వాదనలు వినిపిస్తూ, సిట్ అధికారులు బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీకి వెళ్తే అకడి పోలీసులు సహకరించలేదని చెప్పారు. ఢిల్లీలోని దీన్దయాళ్ రోడ్కు వెళితే అకడ ఉన్న ఎస్హెచ్వో అడ్డుకొని డీసీపీ వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు చేస్తున్నదని, సిట్కు సహకరించకపోవడం కోర్టు ధికారం అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్తూనే ఇకడికి వచ్చి కేసు మీద కేసు వేస్తున్నదని విమర్శించారు. నోటీసు జారీ కాలేదని చెప్తూనే హైకోర్టులో ఆ నోటీసులను సవాల్ చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. నోటీసు అందనప్పుడు ఎలా సవాల్ చేస్తారని నిలదీశారు.
గుడికి తడి బట్టలతో వెళ్లి ప్రమాణాలు చేస్తూ, ఇకడికి వచ్చి కేసులు వేయడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కుట్ర జరిగినట్టు సిట్ వద్ద పకా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వ్యక్తుల ఉన్నత స్థాయి కంటే చట్టం అత్యున్నతమైదని స్పష్టంచేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నొకి చెప్పారు. పార్టీకి కేసుకు సంబంధం లేనప్పుడు నోటీసులను అందుకొన్న వాళ్లు వ్యక్తిగతంగా సవాల్ చేయాలని సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చేందుకు సంతోష్ ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ కేసుకు తనకు ఏం సంబంధం లేదని, అయినా 41 ఏ నోటీసు ఇచ్చారని శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్గౌడ్ వాదించారు. సాక్షుల విచారణకు 41 నోటీసు చట్ట వ్యతిరేకమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులపై స్టేకు నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది.
సిట్ విచారణకు బీఎల్ సంతోష్, శ్రీనివాస్ సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు దర్యాప్తునకు సహకరించడం లేదని సిట్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొన్నది. బీఎల్ సంతోష్కు సిట్ జారీచేసిన నోటీసులను అందజేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఢిల్లీ పోలీసులకు అందజేయాలని సిట్కు సూచించింది. నోటీసులను ఢిల్లీ పోలీస్ కమిషనర్కు వ్యక్తిగతంగా లేదా ఈ-మెయిల్, వాట్సాప్ మెసేజ్ ద్వారా సిట్ పంపవచ్చని పేర్కొన్నది. నోటీసు అందుకొన్న తర్వాత సంతోష్.. సిట్ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ నెల 21న ఉదయం పదిన్నర గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో నిర్వహించే దర్యాప్తునకు హాజరు కావాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా సంతోష్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.