Junior Doctors : రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం ఓపీ సేవలకు దూరంగా ఉండనున్నట్లు జూడాలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. దాంతో ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
కోల్కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బాధితురాలి మర్మాంగాలు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లు, చేతులు, గోళ్లకు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్న నిందితుడు తన పోకిరి చేష్టలతో తరుచూ సదరు వైద్యురాలిని ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. కాగా వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్తో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు. దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.
అయితే అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు మినహాయింపు ఇచ్చారు. ఇక ఘటన జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు తన జూనియర్లతో కలిసి భోజనం చేసి, సెమినార్ రూమ్కి వెళ్లింది. మర్నాడు ఉదయం అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది.