హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమై గ్రామ పంచాయతీల్లో వివిధ పనులకు సంబంధించిన నిధుల విడుదలపై చర్చించారు. తాజాగా పంచాయతీలకు రూ.1,190 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. వివిధ కార్యక్రమాల కోసం చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల కింద ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టింది. వాటికి సంబంధించిన బిల్లులను ప్రస్తుతం విడుదల చేస్తున్నది.
సర్పంచ్ల హర్షం
గ్రామ పంచాయతీలకు ఒకేసారి రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్లు హర్షం వ్యక్తంచేశారు. ఈ నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణతోపాటు పంచాయతీలకు నిధుల విడుదలపై తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్తోపాటు మరికొందరు నేతలు మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కనికరించారని, జీపీలకు నిధులు విడుదల చేయ డం వల్ల అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి ఆసారమిచ్చారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి సర్పంచ్లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలను శ్రీనివాస్రెడ్డి, పొట్ట సత్యంగౌడ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘానికి చెందిన శశిధర్, శివ, భాసర్, హరి, శివకుమార్ తదితరులు ఉన్నారు.
సీఎంకు పువ్వాడ, సత్యవతి కృతజ్ఞతలు
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మం జూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు అం దించడంతోపాటు పట్టాలు పొందిన వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలనే నిర్ణయాలను తీసుకున్నందుకు మంత్రి సత్యవతి రాథోఢ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
గ్రామాలకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా సర్పంచుల సమస్యలన్నీ సీఎం కేసీఆర్కు తెలుసు కాబట్టే వారు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిచే విధం గా చేస్తున్నారు. మన గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా చేస్తున్నారు.
– గూడూరు లక్ష్మీనర్సింహరెడ్డి, సర్పంచ్, కడ్తాల్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు.
ఎవ్వరూ చేయని పనులు చేశాం
మా గ్రామంలో గతంలో ఎన్నడు జరగని పనులు నేను సర్పంచ్గా ఉన్న ఈ సమయంలో జరిగాయి. ఇది నాకు వచ్చిన మంచి అవకాశం. సీఎం కేసీఆర్ సార్ ఆలోచనతోనే ఇది సాధ్యమైంది. మేము గ్రామాల్లో పెద్ద ఎత్తున పనులు చేసేందుకు సరిపడా నిధులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నది.
– రమేశ్, సర్పంచ్, తాటికాయల, హనుమకొండ జిల్లా
చాలా సంతోషంగా ఉన్నది
గ్రామంలో అనేక ప్రజోపయోగ పనులు చేసినం. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలతో గ్రామాల్లో ఎన్నో మార్పు లు వచ్చాయి. అందుకే ఎన్నో అవార్డులు వస్తున్నాయి. మా హయాం లో ఇన్ని పనులు కావడం చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నది.
– చెరుకూరి అండాలు, సర్పంచ్, పొల్కంపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా.