హైదరాబాద్ : కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. బుధవారం కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ-2022ని ఆవిష్కరించి మాట్లాడారు.
కొవిడ్ మొదటి, రెండో వేవ్లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45 రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున తమ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహించి వేలాది మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ క్యాంపులు నిర్వహిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆపద వచ్చినా వారికి అండగా ఉంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.
డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సీనియర్ నాయకులు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పీసీఐ మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.