హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబంలాంటిదని, ప్రతి కుటుంబంలో విభేదాలు ఉన్నట్టే పార్టీలోనూ ఉంటాయి. లోపాలను సవరించుకొని పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్తా కృషి చేయాలి’ అని ఆయన ప్రసంగిస్తుండగానే సభికుల నుంచి జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అని పెద్దపెట్టున నినాదాలు వినిపించాయి.
వచ్చే నెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో ఆదేశించారు. మంగళవారం జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో మంత్రులు పార్టీ జిల్లాల ఇన్చార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఆయా నియోజక వర్గాల పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలపై ఆత్మీయ సమ్మేళనాల్లో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని వైనాన్ని, వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రగతిపై చిమ్ముతున్న విషయాన్ని సమావేశాలకు హాజరైన మంత్రులు పార్టీ శ్రేణులకు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంలో గులాబీ దండు ఏకాభిప్రాయానికి వచ్చింది.
తెలంగాణ భవన్లో పార్టీ హైదరాబాద్ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్రెడ్డి, విప్లవ్ కుమార్, సికింద్రాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావటాన్ని ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ, జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు వాణిదేవి, పట్నం మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.