సూర్యాపేట, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): పదేండ్ల అనంతరం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చేలా నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న ‘చలో నల్లగొండ’ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట జనంలోకి, ప్రధానంగా రైతుల్లోకి వెళ్లింది. కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ కుట్రలు, అవగాహనా రాహిత్యంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అలుముకున్న నైరాశ్యం కూడా ఈ ఒక్క సభతో దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ అధినేత తొలిసారి బయటకు వచ్చి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఉద్యమ ఖిలాగా పేరుగాంచిన నల్లగొండ గడ్డ బీఆర్ఎస్ కీలక సభలకు వేదికగా నిలిచింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించడంతో రైతాంగం నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వివిధ పద్ధతుల్లో తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే వరకూ విశ్రమించని సంగతి తెలిసిందే. అనంతరం స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి దేశానికే దిక్సూచిగా నిలిపింది.
నల్లగొండ సభలో ఉద్యమస్ఫూర్తిని నింపే కేసీఆర్ మాటలకు జనం నుంచి విశేష స్పందన లభించింది. సభా వాతావరణం చూస్తే ఉద్యమకాలం నాటి రోజులు గుర్తుకొచ్చాయి. కొన ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరుగనియ్యనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు లక్షలాదిగా వచ్చిన జనం జై తెలంగాణ అంటూ నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, అవగాహనా రాహిత్యంతో నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ సాగిన ప్రసంగంలో ఎంతో పదును పెంచి వివరించారని సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, వై వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టుగా ఉన్నదని, జనం నుంచీ అంతే మాదిరి స్పందన లభించింది. రాష్ర్టానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని నినదించిన సమయంలో నినాదాలతో సభ మర్మోగింది.
కేసీఆర్లో ఉద్యమ పంథాలో ఏ మాత్రమూ వాడి తగ్గలేదని, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని క్యాడర్ మాట్లాడుకుంటున్నది. కృష్ణా జలాల కోసం కోదాడ నుంచి హాలియా వరకు నాడు ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన పాదయాత్ర, నల్లగొండలో పార్టీ తొలి వార్షికోత్సవ సభ, సూర్యాపేటలో సమరభేరి సభ, భువనగిరిలో భారీ బహిరంగసభ, ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల అనంతరం నల్లగొండలో నిర్వహంచిన సభ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నది. సభ ముగిసిన తర్వాత ఎక్కడ చూసినా రైతుల్లో సాగర్ నీటి మీదే చర్చ వినిపిస్తుంది. కేసీఆర్ చెప్పదల్చుకున్నది ప్రజల్లోకి చేరిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు.