Huzurabad | హుజూరాబాద్ ఓటర్లూ ఉద్యమపార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల పార్టీలోకి పెరిగిన చేరికలే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, సింగపురం గ్రామాలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాధ్యత అంటూ ప్రకటిస్తున్నారు. రాచపల్లికి చెందిన యువనేత అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు 150 మంది సింగపురంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం సింగపురానికి చెందిన మరో 150 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఇక్కడ ఓట్ల కోసం రైతుల జపం చేస్తున్న బీజేపీ పార్టీ.. మరో రాష్ట్రంలో రైతులపై ఉక్కుపాదం మోపుతూ, ధర్నాలు చేస్తున్న వారిపై వాహనాలు ఎక్కించిమరీ చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడున్నా బీజేపీ విధానం ఒక్కటేనని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే.. మళ్లీ రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, 2016 రూ. ఆసరా పెన్షన్ వంటి పథకాలు ప్రజలు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు.
ప్రజలకు వాతలు పెడుతున్న బీజేపీ
దేశాన్నిసుభిక్షంగా పాలించాల్సిన బీజేపీ అధిక ధరలతో సామాన్యులకు వాతలు, కోతలు పెడుతోందని మంత్రి చెప్పారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను పెంచి, సబ్సిడీల్లో కోతలు విధించి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పిన బీజేపీ, ఏడేళ్ల పాలనలో ఒక్క రూపాయి నల్లధనం వెనక్కు తెచ్చిందా ? ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లో వేసిందా? అని ప్రశ్నించారు.
వాళ్లు అమ్ముతుంటే.. మనం కాపాడుకుంటున్నం
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కుదువపెడుతుంటే.. మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామని చెప్పారు హరీశ్రావు. కేంద్రం విధానాలతో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్డునపడే పరిస్థితులు దాపురించాయని చెప్పారు. ఇలాంటి బీజేపీకి బుద్ది చెప్పాలని, హుజూరాబాద్ ఓటర్లు బీజేపీ పాలన తీరును గమనించి వాత పెట్టాలని సూచించారు.
హుజురాబాద్ అభివృద్ధి మా బాధ్యత
హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత మాది. ఇక్కడి సమస్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ను పట్టించుకుని ఉంటే.. మీకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.
నాలుగు వేల ఇళ్లు మంజూరు చేస్తే తోటి మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టించారు. కానీ, ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలపై పోరాటం చేస్తా అని చెప్పి ఆ నల్ల చట్టాలకు ఇప్పుడ మద్దతు ఇస్తున్నారు. బావుల కాడ, బోర్ల కాడ విద్యుత్ మీటర్లు పెడతామంటున్నారు. బీజేపీ ద్వారా రైతులకు, యువతకు, మహిళలకు ఏం లాభం లేదని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.