నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షతులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మాద సునీతగోవర్ధన్ గౌడ్తోపాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..22 ఏండ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని అన్నారు.
జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందన్నారు. తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్లలో అబ్బురపరిచే ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. దేశానికే బువ్వ పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, PACS చైర్మన్ వెలుగురి వల్లపు రెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తోటకురి పరమేష్, అక్కంపల్లి కలుసాని శ్రీనివాస్ రెడ్డి, మాద సుధాకర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, మేకల ఇద్దయ్య, ఉప సర్పంచ్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.