కరీమాబాద్, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్(MLA Aruri Ramesh) అన్నారు. మంగళవారం వరంగల్లోని 44వ డివిజన్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెవ్వ శివరామకృష్ణతో పాటు దాదాపు 500మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. యువత స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు.
అభివృద్ధి, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.