నిజామాబాద్ : తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది, వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసీఆర్, గులాబీ జెండా మాత్రమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం బట్టాపుర్ గ్రామానికి చెందిన రాక్ స్టార్ యూత్ సభ్యులు, బంజారా యూత్ సభ్యులు మంత్రి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాల అభివృద్ది చేశానని చెప్పారు. అభివృద్ది వైపే ఉంటామని యువత నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. యువత భాగస్వామ్యం అబివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల సంక్షేమమే కేసీఆర్ అసలు అజెండా అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల ఆరాటమైతే కేసీఆర్ది తెలంగాణ ప్రజల బతుకుదెరువు, అభివృద్ది ఆరాటమన్నారు. కాంగ్రెస్ ప్రజలను గోస పెట్టే పార్టీ అయితే, బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీ అని దుయ్యబట్టారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం,మండల పార్టీ నాయకులు,గ్రామ సర్పంచ్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.