మహబూబ్నగర్ : పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలని..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలిచి వారికి అన్నివిధాల అండగా ఉంటామని ఆయన తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంఏ నయీం, నాయకులు ఖయ్యూమ్, షెబాజ్, ఉబైద్, ఖలీమ్, 30వ వార్డు, న్యూ మోతీనగర్కు చెందిన బీజేపీ నాయకుడు మధుమోహన్, ఆల్ ఇండియా ఎస్టీ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతివీర్, విజయలక్ష్మి, భవ్య, కావ్య, దివ్య, పరిమళ, నవీన్ కుమార్, ప్రేమ్ కుమార్, రాజ్ కుమార్, సహ సుమారు 50 మంది కౌన్సిలర్ జాజిమొగ్గ నర్సింహులు ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు.
మిగతా పార్టీలలా కాకుండా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని వారికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, కులం మతం పేరిట సమాజాన్ని విడగొట్టడంలో బీజేపీ ముందుంటుందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిం హులు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.