కరీంనగర్ : నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గొంతుకను అయ్యానని మరోసారి ఆశీర్వదిస్తే మీలోనే ఉంటానని..మీతోనే ఉంటానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి, కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్లో చేరికల కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలంలోని యువకులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.
మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో పల్లెలు నీళ్లు లేక అన్నదాతలు అరిగొసలు పడిన పరిస్థితి నుంచి నేడు స్వయం పాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు జలకళ సంతరించుకున్నాయన్నారు. కోట్ల రూపాయల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు. ఆనాడు గ్రామాల్లోకి రావాలంటే రోడ్లు లేక ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి నేడు కోట్ల రూపాయలతో అద్భుతంగా రహదారుల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
60 రోజులు నాకోసం కష్టపడితే 5 సంవత్సరాలు మీ కోసం కష్టపడతానని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, ఎంపిపి పిల్లి శ్రీలత మహేష్, రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, గంగాధర చందు, తదితరులు పాల్గొన్నారు.