హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను పెంచేందుకు లెక్చరర్లు నడుం బిగించారు. రెగ్యులర్ అధ్యాపకులతోపాటు, కాంట్రాక్ట్ అధ్యాపకులు సైతం కదం కలిపారు. ‘రండి.. ప్రభుత్వ కాలేజీల్లోనే చేరండి..’ అంటూ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు అడ్మిషన్లపై ఈ తరహా ప్రచారం చేయగా.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం ఈ కార్యాచరణలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 128 డిగ్రీ కాలేజీలున్నాయి. గతంలో ప్రైవేటు జోరులో ఈ కళాశాలలు అడ్మిషన్లు లేక నీరసించాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) వెబ్సైట్ రాక, అధ్యాపకుల చొరవ కారణంగా ప్రైవేటు జోరు తగ్గి, ప్రభుత్వ కాలేజీల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గతంలో 20వేల లోపు ఉన్న ప్రవేశాల సంఖ్య ప్రస్తుతం 52,500కు చేరుకుంది.
స్వయంప్రతిపత్తి దిశగా..
వసతుల కల్పనలో టాప్లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను సాధిస్తున్నాయి. ఇప్పటికే 10 కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా.. తాజాగా మరో 4 కాలేజీలు ఆ అర్హతను సాధించాయి. హైదరాబాద్లోని ఇందిరాప్రియదర్శిని డిగ్రీ కాలేజీ, ఖమ్మం, నల్లగొండ మహిళా కాలేజీలు, నర్సంపేట డిగ్రీ కాలేజీలు కొత్తగా అటానమస్ హోదాకు అర్హత సాధించాయి. దీనిపై యూజీసీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది. రాష్ట్రంలోని మరో ఆరు డిగ్రీ కాలేజీలు సైతం అటానమస్ దిశగా అడుగులేస్తున్నాయి. గతేడాది అడ్మిషన్లలో అటానమస్ కాలేజీల్లో 84.42 శాతం, ప్రభుత్వ కాలేజీల్లో 65.57శాతం, ప్రైవేట్ కాలేజీల్లో 50.91 శాతం సీట్లు నిండాయి. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ అడ్మిషన్లను మరింతగా పెంచుకునేందుకు అధ్యాపకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
న్యాక్ వివరాలు సైతం వెబ్సైట్లో..
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) వెబ్సైట్లో ఈసారి స్వల్ప మార్పులు చేశారు. ఈ ఏడాది కాలేజీల న్యాక్ గుర్తింపు వివరాలను సైతం వెబ్సైట్లో పొందుపరచనున్నారు. ఇదివరకు కళాశాలల పేర్లు మాత్రమే ఉండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి న్యాక్ గుర్తింపు వివరాలను సైతం ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. రాష్ట్రంలో 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 90కి పైగా న్యాక్ గుర్తింపును కలిగి ఉన్నవే. దీంతో ఆయా కాలేజీల పేరు పక్కన న్యాక్ గ్రేడ్ను సైతం ప్రదర్శిస్తారు.
క్యాంపెయిన్ సాగుతున్నదిలా..
ప్రభుత్వ కాలేజీల్లో క్వాలిఫైడ్ అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే అన్నిరకాల వసతులుంటాయి. నెట్, సెట్, పీహెచ్డీ అర్హతలున్న వారే అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వ కళాశాలలే తోడ్పాటును అందించగలవు. అడ్మిషన్లు పెంచడం కోసం మా అసోసియేషన్తో పాటు అధ్యాపకులు అంతా సమిష్టిగా కృషిచేస్తున్నాం. ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, పోస్టర్లు వేసి ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని కోరాం. వాట్సాప్, సోషల్ మీడియా సేవలను సైతం వినియోగించుకుంటున్నాం. అడ్మిషన్లను పెంచి ప్రభుత్వ కాలేజీలను కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం.
– సురేందర్రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం