Gadwal | అయిజ రూరల్, ఏప్రిల్ 2 : తుంగభద్ర నదీ తీరంలో చెలిమెల్లో బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టుకుంటున్న వీరంతా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కేశవరం గ్రామస్తులు. 466 నివాస గృహాలు, 2,060 జనాభా ఉన్న ఈ గ్రామంలో మిషన్ భగీరథ నల్లా నీరు ప్రతి రోజూ ఐదు నుంచి 10 నిమిషాలు మాత్రమే వస్తున్నది.
దీంతో నీటి కోసం గ్రామస్తులు సుమారు 2 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నడిచివెళ్లి, ఏపీ సరిహద్దులోని తుంగభద్ర నదీతీరంలో ఇసుకను తవ్వి చెలిమెలా చేసి నీటిని పట్టుకుంటున్నారు. ఇలా ఒక్కో బిందె నిండడానికి సుమారు 2 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోయారు. దీంతో తెల్లవారుజాము నుంచే నదిలో నీటి కోసం బారులుదీరుతున్నారు.