హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో సమ్మెకు ఇటీవల అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుపై చర్చలు సఫలమయ్యాయి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ లక్ష్మణ్ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి, ఆరు కార్మిక సంఘాలకు మధ్య బుధవారం 9 అంశాలపై చారిత్రక ఒప్పందం కుదిరింది. గత 15 ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి అన్ని కార్మిక సంఘాలతో ఈ ఒప్పందం కుదరడం విశేషం. కరోనా సమయంలో దాదాపు ఒకటిన్నర ఏండ్లపాటు మెడికల్ బోర్డు నిర్వహించనందువల్ల ఆ సమయంలో 35 ఏండ్లు దాటిన వారసులకు కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.
ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ కరోనా వల్ల మృతి చెందినవారి కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు సమ్మతించింది. తెలంగాణలోని 4 బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కోరేందుకు ఢిల్లీకి వెళ్లే కార్మిక సంఘాల నాయకులకు పూర్తి సహకారం అందించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందంపై గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు, సింగరేణి తరఫున డైరెక్టర్ బలరాం, జీఎం ఆనందరావు సంతకాలు చేశారు.
వందేండ్ల భవిష్యత్తుకు ప్రణాళికలు
సింగరేణికి మరో వందేండ్లపాటు ఉజ్యల భవిష్యత్తు ఉండేలా సీఎండీ ఎన్ శ్రీధర్ సారథ్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డైరెక్టర్ బలరాం తెలిపారు. కంపెనీ ప్రగతికి కార్మిక సంఘాలన్నీ సహకరించాలని కోరారు. తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు. చర్చల్లో గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, ప్రాతినిధ్య సంఘం నుంచి సీతారామయ్య, రాజ్కుమార్, ఐఎన్టీయూసీ నుంచి జనక్ప్రసాద్, నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ నుంచి రియాజ్ అహ్మద్, రమేశ్, సీఐటీయూ నుంచి నర్సింహారావు, నాగరాజు గోపాల్, బీఎంఎస్ నుంచి సత్తయ్య, రవీందర్రావు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.