ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిరుద్యోగ, విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. ఓయూకు ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో అయిదు వేల పోస్టులు కాకుండా కనీసం ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ప్రతీ ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటించి, అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.