హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు నూతన సంవత్సర కానుకగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జయిని మహంకాళి , బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు.
మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దశలవారీగా లక్ష 20 వేల ఉద్యోగాల భర్తీ చేస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని , ఈ సంవత్సరం కూడా అన్ని వర్గాల ప్రజలు, పాడి పంటలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, కిరణ్మయి, చైర్మన్ లు కామేశ్, సాయిబాబా గౌడ్, ఈవో మనోహర్ రెడ్డి, అన్నపూర్ణ, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, శ్రీనివాస్ గౌడ్, మహేందర్, చందు తదితరులు ఉన్నారు.