హైదరాబాద్ : ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. నీళ్లు, నిధులు సాధించుకున్నట్టే, ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 80,039 ఉద్యోగాలకు నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని చెప్పారు.
ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయన్నారు. తద్వారా నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.