8 ఏండ్లుగా ఎందుకు భర్తీ చేయలేదు?.. లోక్సభ ఎన్నికల ముందు మరో జుమ్లా
ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీని నమ్మడం కష్టం
60 లక్షల ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ఇవ్వాలి
రంగాలవారీగా కేంద్రం పోస్టుల వివరాలివ్వాలి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, 8 ఏండ్లుగా వాటిని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత ఒత్తిడి వల్లే మోదీ ఉద్యోగ ప్రకటన చేశారని పేర్కొన్నారు. కేంద్రానికి ఉద్యోగాల భర్తీపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే 60 లక్షల ఖాళీలను రంగాలవారీగా, పీఎస్యూలవారీ భర్తీచేయటంపై శ్వేత పత్రం విడుదల చేయాలని బుధవారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం చాలా చిన్నదైనప్పటికీ గత ఎనిమిదేండ్లలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, తాజాగా మరో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. ఇదే నిష్పత్తిలో 2014 నుంచి 140 కోట్ల జనాభా కోసం దేశంలో ఎన్ని ఉద్యోగాలను సృష్టించారని కేంద్రాన్ని నిలదీశారు. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడిస్తారు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. యువతకు 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల్లుగా ప్రమాదకర ఆర్థిక విధానాలు అనుసరిస్తూ యువతకు ఉద్యోగాలు రాకుండా చేశారని మండిపడ్డారు. ఎనిమిదేండ్ల్లుగా ఉద్యోగాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం, సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని చేపట్టడం ముమ్మాటికీ ఎన్నికల స్టంట్ అని, మోదీ విసిరిన మరో జుమ్లాగా ఆగ్రహం వ్యక్తంచేశారు.