ఉద్యోగార్థులు లక్ష్యంతో సాధన చేయాలి
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పిలుపు
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సదస్సుకు భారీగా తరలివచ్చిన యువత
పరిగి, జూన్ 14: ప్రణాళిక తయారు చేసుకొని పట్టుదలతో చదివితే సర్కారు కొలువు సాధించడం సులువేనని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్లో ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్ సీఎస్ వేపతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగార్థుల కోసం నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ‘కొలువు-గెలువు’ అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాల సాధనకు ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్తో జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంతో నీళ్లు వచ్చాయని, నిధులు సమృద్ధిగా ఉండటంతో అభివృద్ది పరుగులు తీస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే లక్షా 35 వేల పైచిలుకు ఉద్యోగాల నియామకాలు చేపట్టిందని, తాజాగా 90 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లావాసులు అత్యధిక ఉద్యోగాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. అనంతరం సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప ఉద్యోగార్థుల సందేహాలను తీర్చారు. కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, బడ్జెట్, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కే అరవిందరావు, జడ్పీటీసీ బీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇంచార్జి చిరంజీవిప్రసాద్, ఈవెంట్స్ మేనేజర్ గణేశ్, స్టాఫ్ రిపోర్టర్ కే బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.