ధర్మపురి(జగిత్యాల): జగిత్యాల జిల్లా(Jagtial district) ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు. శుక్రవారం వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో రూ.13 కోట్ల నిధులతో స్థల సన్నద్దత పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) వల్ల ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించామని వివరించారు. క్రిభ్కో(Kribhico) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఏర్పాటుకు గత నవంబర్లో ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గోదావరి నది సమీపంలోని వెల్గటూర్ మండల పరిధిలో పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు గాను మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) స్థల సన్నద్దత కోసం రూ. 13 కోట్లను కేటాయించారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా రైతాంగానికి ,వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన దొరుకుతుందని తెలిపారు. పుష్కలమైన నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న ధర్మపురి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్రిభ్కో సంస్థ ముందుకు రావడంతో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు పరిశ్రమకు రూ. 700ల కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు . ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిభ్కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల జగిత్యాల జిల్లా సాంకేతిక రంగ స్వరూపమే మారిపోనుందని తెలిపారు.