వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 18: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైకోర్టును నగరానికి దూరంగా ఉన్న ప్రేమావతి పేటకు (వ్యవసాయ వర్సిటీకి) తరలించడం అన్యాయమని రాష్ట్రంలోని పలు బార్ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని ‘తుగ్లక్ చర్య’గా అభివర్ణిస్తూ.. జీవో 55ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధి కోసమే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా హైకోర్టు తరలింపునకు ఏకపక్ష ఈ నిర్ణయం తీసుకున్నదని ధ్వజమెత్తారు. వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీల భూములను బలవంతంగా లాక్కొని హైకోర్టు భవనాన్ని కట్టడం భావ్యం కాదని స్పష్టం చేశారు. దీని వల్ల వ్యవసాయ విద్యార్థులతోపాటు రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలకు చెందిన న్యాయవాదులు వృత్తికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మరో 100 ఏండ్ల వరకు ఉపయోగపడే చారిత్రక హైకోర్టు భవనాన్ని వదిలిపెట్టి కొత్త భవనాన్ని కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు తొందరపాటు చర్యను నిరసిస్తూ ఆదివారం వారు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా రాష్ర్టాంలోని అన్ని బార్ అసోసియేషన్లు తీర్మానాలు చేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ప్రత్యక్ష పోరాటానికి దిగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ వర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత హైకోర్టు వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. మూసీనదిపై వంతెనలు కట్టి, వాటిపై పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని, ఆ డబ్బును కింది స్థాయి కోర్టుల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. న్యాయవాద సంఘాల నాయకులు శారదాగౌడ్, మామిడి వేణుమాధవ్, శ్రీకర్రెడ్డి, భూక్యా రాజ్కుమార్, శ్రీజ, శంకర్నాయక్, మధుకర్, అరవింద్, వంశీధర్రెడ్డితోపాటు వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.