హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/బాలానగర్ : యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ (యూఐఐసీ), జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) సంయుక్తంగా శని, ఆదివారాల్లో నిర్వహించిన మెగా జాబ్మేళా విజయవంతమైంది. హెచ్ఆర్ కో, లాస్య ఇన్ఫోటెక్ సహకారంతో ఈ మేళాను నిర్వహించారు. మొదటిరోజు 80 వేలు, రెండోరోజు 74 వేల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు నిర్వాహకులు తెలిపారు.
మేళాలో 268 కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. 15 వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. కోర్, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ తదితర రంగాల నుంచి కంపెనీలు వచ్చి జాబ్మేళాను విజయవంతంగా చేయడం పట్ల జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, ఉద్యోగాలిచ్చిన ఆయా కంపెనీల హెచ్ఆర్లను అభినందించారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారా కల్యాణి, యూఏఏ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతుల సురేశ్కుమార్ పాల్గొన్నారు.