హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక 109వ ఇండియ న్ సైన్స్ కాంగ్రెస్కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. 2024లో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్కు నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అతిథ్యం ఇవ్వనున్నది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఫిబ్రవరి మూడు, నాలుగువారాల్లో ఈ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఐఎస్సీ ప్రెసిడెంట్ డాక్టర్ అర్వింద్ సక్సేనా, మాజీ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ సక్సేనా, డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా, ప్రొఫెసర్ రంజిత్ వర్మ, ప్రొఫెసర్ నారాయణరావుతో కూడిన నిపుణుల కమిటీ ఈ నెల 23న జేఎన్టీయూను సందర్శించి, నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహా పలువురు నోబుల్ బహుమతి గ్రహీతలు హాజరయ్యే అవకాశం ఉన్నది. సుమారు 7 వేల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారు. ఈ సైన్స్ కాంగ్రెస్లో 14 సెషన్లు జరుగుతాయి. దీని నిర్వహణకు ముగ్గురు కాన్ఫరెన్స్ సెక్రటరీలను నియమిస్తారు. సుమారు రూ.8 నుంచి రూ.10 కోట్లు ఖర్చు కానున్నట్టు జేఎన్టీయూ వర్గాలు అంచనా వేస్తున్నా. ఇప్పటివరకు హైదరాబాద్లో ఐఎస్సీని ఆరుసార్లు నిర్వహించగా, వచ్చే ఏడాది జరగబోయేది ఏడో సదస్సు కానున్నది.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఎన్టీయూ కోరింది. ఈ మేరకు జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి గురువారం సీఎంవోకు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సెక్రటరీకి వేర్వేరుగా లేఖలు రాశారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు రూ.10 కోట్లు అవసరమవుతాయని, ఆయా నిధులను మంజూరు చేయాలని సీఎంవోకు రాసిన లేఖలో వీసీ ప్రస్తావించారు. ఇదిలావుండగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు ఏర్పాట్లు చేసే పనిలో జేఎన్టీయూ అధికారులు నిమగ్నమయ్యారు.