హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులపై ఫీజుల పిడుగు పడింది. డూప్లికేట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, నేమ్, ఫొటో, ఫాదర్నేమ్, జెండర్, మార్పులు, గ్రేస్ మార్కులు వంటి మొత్తం 24 రకాల స్టూడెంట్ సర్వీసులపై భారీగా ఫీజులు పెంచుతూ ఇటీవల జేఎన్టీయూ నిర్ణయం తీసుకున్నది. దీంతో గ్రా మీణ నేపథ్యం, పేద కుటుంబాల విద్యార్థులు పెంచిన ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఫొటో, పేరు, జెండర్ మార్పుల దరఖాస్తులకు రూ.500 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం వర్సిటీ నిర్ణయం వల్ల రూ.5,000 పెరిగింది. తత్కాల్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (సీఎంఎం) దరఖాస్తు ఫీజు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచారు. గ్రేస్ మార్కుల దరఖాస్తుల కోసం జీరో ఫీజు ఉండేది. ఇప్పుడు ఒకేసారి రూ.2,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు మినహా అన్ని రకాల స్టూడెంట్ సర్వీసుల దరఖాస్తుల ఫీజులు పెంచారు. పేరు, ఫొటో, ఫాదర్ నేమ్, జెండర్ వంటి వాటిలో సహజంగా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని విద్యార్థులు ఎప్పటికప్పుడు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్నే యూనివర్సిటీ ఆదాయ మార్గంగా మలుచుకున్నది. దీంతో జేఎన్టీయూ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యూనివర్సిటీ ఆదాయం పెంచుకోవాలంటే విద్యార్థులపై ఆర్థిక భారం మోపాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్యూషన్, పరీక్ష ఫీజులతో ఇంజినీరింగ్ విద్యార్థులు సతమతమవుతుంటే, స్టూడెంట్ సర్వీసులపైనా ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసమంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ విషయంపై యూనివర్సిటీలో స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రదర్శించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సైతం ముట్టడించారు. ఫీజులు తగ్గించకపోతే దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని ఎస్పీఎఫ్ నాయకుడు జవ్వాజీ దిలీప్ హెచ్చరించారు.
జేఎన్టీయూలో కొన్ని రకాల స్టూడెంట్ సర్వీసుల దరఖాస్తుల ఫీజులు పెంచామని, గ్రేస్ మార్కులకు గతంలో జీరో ఉంటే ఇప్పుడు రూ.2,000 పెంచినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం కోసం పెంచలేదని, యూనివర్సిటీ అభివృద్ధి, అకాడమిక్ విధానాన్ని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు.